ఖతార్‌లోని భారతీయులకు ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ'.. భారత ఎంబసీ హెచ్చరిక

by Kema Shiva Kumar |

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని దోహాలోని భారత ఎంబసీ ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ’ జారీ చేసింది.

ఖతార్‌లోని భారతీయులకు ‘ఎమర్జెన్సీ అడ్వైజరీ.. భారత ఎంబసీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడి భారతీయుల కోసం అత్యవసర ప్రయాణ హెచ్చరికలను (Emergency Travel Advisory) జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచించింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని ఎంబసీ స్పష్టం చేసింది. యుద్ధానికి సంబంధించి ఖతార్ ప్రభుత్వ అధికారిక ఛానళ్లు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, అనధికారిక వనరుల ద్వారా వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇక సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలను, తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని రాయబార కార్యాలయం భారత పౌరులకు సూచించింది. కాగా, గల్ఫ్ రీజియన్‌లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, ఖతార్‌లోని లక్షలాది మంది భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత ఎంబసీ ఇవాళ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Next Story