హడలెత్తించిన పెద్దపులి.. ప్రాణభయంతో గంటపాటు కరెంటు స్తంభంపైనే సిబ్బంది!

by Ramesh Naini |

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ముల్‌ తాలూకాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

హడలెత్తించిన పెద్దపులి.. ప్రాణభయంతో గంటపాటు కరెంటు స్తంభంపైనే సిబ్బంది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ముల్‌ తాలూకాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫుల్జరి గ్రామంలో విద్యుత్‌ లైన్‌ మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఓ పెద్దపులి ప్రత్యక్షమైంది. దీంతో ప్రాణభయంతో వణికిపోయిన (MSEDCL) విద్యుత్ సిబ్బంది, తమను తాము కాపాడుకునేందుకు కరెంటు స్తంభంపైనే ఉండిపోయారు. పులి ఎటు వెళ్లకుండా స్తంభం చుట్టుపక్కలే సంచరిస్తుండటంతో.. కిందికి దిగితే ఎక్కడ దాడి చేస్తుందోనని సుమారు గంటపాటు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ స్తంభంపైనే గడిపారు. చివరకు ఆ పులి అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకుని సురక్షితంగా కిందకు దిగి తమ మిగతా పని పూర్తి చేశారు.

ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రపూర్ పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో విధులు నిర్వహించే విద్యుత్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story