SIR ఎఫెక్ట్.. ఉత్తరప్రదేశ్ లో 2.8కోట్ల ఓట్ల తొలగింపు

by Naga Rani Yarlagadda |

తాజాగా యూపీలో SIR ప్రక్రియ పూర్తవ్వగా.. మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. "సర్"లో 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించింది.

SIR ఎఫెక్ట్.. ఉత్తరప్రదేశ్ లో 2.8కోట్ల ఓట్ల తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఉన్న నకిలీ ఓట్ల తొలగింపు, తప్పులు, ఇతర వివరాలను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా యూపీలో ఈ ప్రక్రియ పూర్తవ్వగా.. మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. "సర్"లో 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించింది. రాష్ట్రం నుంచి శాశ్వతంగా వలసవెళ్లిన వారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు చేసుకున్నవారిని తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా తెలిపారు. 2.89 కోట్ల ఓటర్లను తొలగించిన తర్వాత 15.44 కోట్ల ఓటర్లుగా ఉన్న సంఖ్య 12.56 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు.

తొలగించిన ఓటర్లలో 46 లక్షల మంది మరణించారని, 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా.. 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువచోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఓటర్లు తమ పేరు ముసాయిదా లిస్టులో ఉందో లేదో యాప్ ద్వారా లేదా ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ విధానాల్లో అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించాక మార్చి 6న ఫైనల్ ఓటర్ల లిస్టును విడుదల చేస్తామని తెలిపారు.

Next Story