రూ.2,455 కోట్ల విరాళం ఇచ్చిన ‘లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా’

by Dishanational4 |
రూ.2,455 కోట్ల విరాళం ఇచ్చిన ‘లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా’
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తు.చ తప్పకుండా అమలు చేసింది. ఎస్‌బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రమే విప్పేసింది. 763 పేజీల్లోని ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌ eci.gov.in వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని విరాళాలు వచ్చాయి ? ఆ విరాళాలను ఇచ్చిన దాతలు ఎవరు ? అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ లిస్టు ప్రకారం..యావత్ భారత్‌లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆపార్టీకి రూ. 6,061 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి.

టాప్ -10 దాతలు ఎవరో తెలుసా ?

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 మధ్యకాలంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందడం గమనార్హం. వీటిలో టాటా గ్రూప్, అదానీ గ్రూప్, రిలయన్స్ గ్రూప్‌ లేకపోవడం గమనార్హం. ఆ మూడు దిగ్గజ కంపెనీలు తప్పకుండా ఎలక్టోరల్ బాండ్ల లిస్టులో ఉంటాయని అంతా భావించారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమైంది. రాజకీయ పార్టీలకు భారీ విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా ? శాంటియాగో మార్టిన్. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈయన రూ.2,455.20 కోట్లను విరాళంగా ఇచ్చాడు. దీన్నిబట్టి అతడి సంపాదన ఏ రేంజ్‌లో ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో లాటరీ సేల్స్ లీగల్‌గా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో మార్టిన్ బిజినెస్ చేస్తూ నిత్యం కోట్లు సంపాదిస్తున్నాడు. 2023 సంవత్సరం మేలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తమిళనాడులోని శాంటియాగో మార్టిన్ వ్యాపారాలపై రైడ్స్ చేసింది. ఆ సందర్భంగా రూ.457 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసింది.

రెండో పేరు మన హైదరాబాద్ కంపెనీదే..

అత్యధిక విరాళం ఇచ్చిన కంపెనీల లిస్టులో రెండో పేరు మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజినీరింగ్‌ అండ్ ఇన్‌ఫ్రాదే. ఈ కంపెనీ రూ.2318 కోట్లు డొనేషన్‌గా అందించింది. మహారాష్ట్రకు చెందిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.658 కోట్లు, వేదాంత లిమిటెడ్ రూ.729.3 కోట్లు, హల్దియా ఎనర్జీ లిమిటెడ్ రూ.752 కోట్లు, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండ్స్ లిమిటెడ్ రూ.449 కోట్లు, కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.390 కోట్లు, ఎంకేజే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ.370.74 కోట్లు, మదన్‌లాల్ లిమిటెడ్ రూ.347 కోట్లు విరాళంగా అందించాయి. భారతీ ఎయిర్ టెల్ గ్రూపు రూ.330 కోట్లు, వెస్ట్రన్ యూపీపవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ రూ.220 కోట్లు, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రూ.270.6 కోట్లు, ఉత్కల్ అల్యుమిన ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.270.6 కోట్లు, ధరివాల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.230 కోట్లు, బిర్లా కార్బో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.210 కోట్లు, చెన్నై గ్రీన్ వుడ్స్ రూ.210 కోట్లు, బీజీ శిర్కే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ రూ.200 కోట్లు విరాళంగా పార్టీలకు ఇచ్చాయి.


Next Story

Most Viewed