ECI: పారదర్శకంగానే ఓటర్ల జాబితా.. ప్రతిపక్షాల ఆరోపణలపై ఈసీ క్లారిటీ

by B.Srinivas |

ఓటర్ల జాబితాలో తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పందించింది.

ECI: పారదర్శకంగానే ఓటర్ల జాబితా.. ప్రతిపక్షాల ఆరోపణలపై ఈసీ క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల జాబితాలో తప్పులు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పందించింది. విపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టింది. గత ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగాయని చెప్పడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా తయారు చేయబడుతుందని, ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు పాల్గొంటాయని తెలిపింది. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ తర్వాత అభ్యంతరాలను లేవనెత్తాలని, కానీ కొన్ని పార్టీలు తగిన సమయంలో ఓటరు జాబితాను తనిఖీ చేయలేదని, ఈ వ్యత్యాసాలకు రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించింది. లోపాలను సరైన టైంలో ఎత్తి చూపి ఉంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO)లు తప్పులను సరిదిద్ది ఉండేవారని తెలిపింది. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు జాబితాలను నిశితంగా పరిశీలించకపోవడమే ఈ లోపాలకు కారణమని పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాలను డిజిటల్, పేపర్ లో ప్రచురించి అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఓటర్ల జాబితాలను ఈసీఐ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించామని వెల్లడించింది.

రేపు మీడియా సమావేశం

ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు, బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాపై ప్రతిపక్ష పార్టీల నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాలపై ఈసీ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Next Story