Earthquake: మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భారీ భవనాలు, ఆస్తి నష్టం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-28 11:50:10  IST  )

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది.

Earthquake: మయన్మార్‌, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భారీ భవనాలు, ఆస్తి నష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్‌ (Myanmar)తో పాటు థాయ్‌లాండ్ (Thailand)రాజధాని బ్యాంకాక్‌ (Bangkok)లో ఇవాళ సరిగ్గా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు.. 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపం సంభవించింది. అయితే, మయన్మార్‌ (Myanmar)లో 7.7, బ్యాంకాక్‌(Bangkok)లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Richter Scale)పై 7.3గా నమోదైంది. అయితే భూకంప కేంద్రం మమన్మార్‌లోని సాగింగ్ (Sagging) సమీపంలో ఉన్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) అధికారులు వెల్లడించారు. ఉన్నట్టుండి భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం కారణంగా మయన్మార్‌ (Myanmar)లోని మండలే (Mandalay)లో ఉన్న ఐకానిక్ అవా వంతెన (Awa Bridge) ఇరావడీ నది (Irrawaddy River)లో కూలిపోయింది. అదేవిధంగా పెద్ద భవనాలు కూడా నేలకూలినట్లుగా తెలుస్తోంది. కుప్పకూలిన ఓ భవనంలో 43 మంది గల్లంతైనట్లుగా.. 15 మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్‌లో భవనాలు ఊగడంతో అందులో ఉన్న జనాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. థాయిలాండ్ అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది, అదేవిధంగా అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌ను లాక్‌డౌన్ చేసింది. మయన్మార్, బ్యాంకాక్‌తో పాటు భారత్‌‌లోని ఢిల్లీ, కోల్‌కతాతో పాటు ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఇక బంగ్లాదేశ్, లావోస్, చైనా దేశాల్లో అక్కడక్కడ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story