Flash News: విజయ్ పట్టాభిషేకానికి అడ్డంకిగా మెజారిటీ.. షాకిచ్చిన వామపక్షాలు

by Naga Rani Yarlagadda |

విజయ్ కు వామపక్షాలు మద్దతు నిరాకరించాయి. దీంతో రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడినట్లయింది.

Flash News: విజయ్ పట్టాభిషేకానికి అడ్డంకిగా మెజారిటీ.. షాకిచ్చిన వామపక్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సాధించడంలో 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు కూడగట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కావలసి ఉంది. అయితే.. తాజాగా వామపక్షాల నుంచి ఊహించని షాక్ తగిలింది. మద్దతు ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో రేపు (మే 7) జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

తిరస్కరించిన వామపక్షాలు

విజయ్ పార్టీకి ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజారిటీకి కావాల్సిన మరో 6 స్థానాల కోసం విజయ్ వామపక్షాలను సంప్రదించారు. అయితే.. సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతిచ్చేందుకు నిరాకరించాయి. తాము డీఎంకే నేతృత్వంలోని 'సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్'లోనే కొనసాగుతామని ఆ పార్టీల నేతలు స్పష్టం చేశారు. దీంతో విజయ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తిస్థాయి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పత్రాలు ప్రస్తుతం విజయ్ వద్ద లేకపోవడంతో, ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. సంపూర్ణ మెజారిటీ నిరూపించుకునేందుకు తనకు రెండు వారాల (14 రోజులు) సమయం కావాలని విజయ్ గవర్నర్‌ను కోరారు.

ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత

వాస్తవానికి మే 7వ తేదీన ఉదయం 11:30 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫలితంగా రేపటి కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఏఐడీఎంకేతో కూడా టీవీకే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడులో దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ మార్పులో, 'దళపతి' విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ను ఎలా అందుకుంటారు? గవర్నర్ ఆయనకు అవకాశం ఇస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Next Story