భారత్‌ను మోసం చేయొద్దు.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్

by Disha Web Desk 17 |
భారత్‌ను మోసం చేయొద్దు.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
X

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం కనిపించకుండా పోతుందని యూఎస్, యూరోపియన్ దేశాలు చొరవ తీసుకోవాలన్న కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. దేశాన్ని మోసం చేయొద్దని కాంగ్రెస్ నేతను ఆయన కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీజీ భారతదేశానికి ద్రోహం చేయవద్దు. దేశ విదేశాంగ విధానంపై ఉన్న అభ్యంతరాలు ఈ సమస్యపై మీకున్న తక్కువ అవగాహనకు నిదర్శనం. విదేశీ గడ్డపై మీరు భారత్‌పై ప్రచారం చేస్తున్న అబద్ధాలను ఎవరూ నమ్మరు’ అన్నారు.

గతంలో రాహుల్ పార్టీ కూడా ఇదే ప్రచారం చేసిందని విమర్శించారు. వారింకా బానిసత్వం నుంచి బయటకు రాలేదని అన్నారు. తన వైఫల్యాలను దాచిపెట్టే కుట్రలో భాగంగానే రాహుల్ విదేశీ గడ్డపై భారత్‌పై దుష్ప్రచారం చేశారని ఠాకూర్ అన్నారు. కరోనా సమయంలోనూ భారత వ్యాక్సిన్లపై ఆయన సందేహపూరిత ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు.

అవినీతి కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారని, రాజ్యాంగ సంస్థలపై విశ్వాసం కోల్పోయారని తెలిపారు. కాగా, లండన్ పర్యటనలో ఓ చర్చలో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరగుతుందని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed