22 కోట్ల అమెరికన్ ఓటర్ల డేటా చోరీ.. చైనాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు

by Malleboina Mahesh |

22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల డేటాను చైనా దొంగిలించిందంటూ డీ-క్లాసిఫైడ్ పత్రాలను విడుదల చేసి సంచలన ఆరోపణలు చేసిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్!

22 కోట్ల అమెరికన్ ఓటర్ల డేటా చోరీ.. చైనాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: సంచలన ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ సారి చైనాపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు చైనాపై అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల సమయంలో చైనా ఏకంగా 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని (డేటా) అక్రమంగా దొంగిలించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలను ఈ సందర్భంగా బయటపెట్టారు. దొంగిలించబడిన ఓటర్ల డేటాలో అమెరికన్ల పేర్లు, నివాస చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి రాజకీయ అనుబంధ సమాచారం (ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు) వంటి అత్యంత సున్నితమైన సమాచారం చైనా చేతికి వెళ్ళిందని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు ఉన్నతాధికారులు (డీప్ స్టేట్) ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని, అధ్యక్షుడు, కాంగ్రెస్ (పార్లమెంట్) దృష్టికి రాకుండా తొక్కేశారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎఫ్‌బీఐ (FBI), డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ను ఆయన ఆదేశించారు. కాగా, ఈ పత్రాల ఆధారంగా అమెరికాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ కౌంటింగ్ వ్యవస్థలు విదేశీ శక్తుల సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేయగా.. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తక్షణమే తోసిపుచ్చింది. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో, ఎన్నికల్లో ఎన్నడూ జోక్యం చేసుకోబోమని చైనా స్పష్టం చేసింది.

Next Story