ఢిల్లీ విమానాశ్రయంలో కుక్కల బీభత్సం: 3 నెలల్లో 31 కుక్కకాటు ఘటనలు

by Ramesh Naini |

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

ఢిల్లీ విమానాశ్రయంలో కుక్కల బీభత్సం: 3 నెలల్లో 31 కుక్కకాటు ఘటనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రయాణికులు, సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు విమానాశ్రయంలోని మూడు టెర్మినల్స్ పరిధిలో ఏకంగా 31 కుక్కకాటు ఘటనలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో 24 కేసులు విమానాశ్రయ సిబ్బందికి సంబంధించినవే కావడం గమనార్హం.

వీడియోలు విడుదల చేసిన యాజమాన్యం

పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన విమానాశ్రయ అధికారులు.. కుక్కలు దాడులు చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను తాజాగా విడుదల చేశారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులతో కలిసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇటీవల ఒక కుక్కను బలవంతంగా బయటకు పంపారన్న ఆరోపణలపై యాజమాన్యం వివరణ ఇస్తూ.. ఆ కుక్క ప్రయాణికులపై దాడి చేసి కరిచినందుకే అలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

ప్రయాణికులకు అధికారుల సూచనలు

విమానాశ్రయ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఎవరూ ఆహారం పెట్టవద్దని, వాటికి దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కొన్నిసార్లు మంచి ఉద్దేశ్యంతో కుక్కల దగ్గరకు వెళ్లినా, అవి రక్షణాత్మక ధోరణితో దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విమానాశ్రయంలో ఎక్కడైనా దూకుడుగా ప్రవర్తించే కుక్కలు కనిపిస్తే, స్వయంగా వాటిని పారద్రోలే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి లేదా హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని ప్రయాణికులను కోరారు. ఇందరికి సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విమానాశ్రయ అథారిటీ కోరింది.

Next Story