జమిలి ఎన్నికల నిర్వహణను ఏకీభవించడంలేదు: దీదీ

by Dishanational1 |
జమిలి ఎన్నికల నిర్వహణను ఏకీభవించడంలేదు: దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గురువారం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై ఏకీభవించడంలేదని తెలిపారు. 'ఒక దేశం, ఒకే ఎన్నిక' విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రానికి విరుద్ధమని, ఈ మేరకు జమిలీ ఎన్నికలపై అధ్యయం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించేందుకు ఈ విధానం తెస్తున్నారని, దీనికి తాను పూర్తి వ్యతిరేకమని, జమిలి ఎన్నికలకూ దూరంగా ఉండనున్నట్టు దీదీ స్పష్టం చేశారు. 'జమిలి ఎన్నికల విధానంపై స్పష్టత లేదు. భారత రాజ్యాంగం ఒకే దేశం, ఒకే ప్రభుత్వాన్ని అనుసరించడంలేదు. మీ జమిలి ఎన్నికల ప్రతిపాదనలను విభేదిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరు కారణాలతో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చు. గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో లోక్‌సభ పలుమార్లు ముందుగానే రద్దయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకే ముందుగా ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం సబబు కాదు. ఈ పద్దతి వల్ల ఎన్నికలపై ఓటర్ల విశ్వాసం తగ్గించడమేనని' మమతా బెనర్జీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed