ఇందిరా, రాజీవ్ గాంధీలను అగౌరవపర్చినట్టే: కుల గణనపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
ఇందిరా, రాజీవ్ గాంధీలను అగౌరవపర్చినట్టే: కుల గణనపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హామీపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న స్వరాలు వినపడుతున్నాయి. కుల గణన డిమాండ్‌ను ముందుకు తీసుకురావడం అంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని అవమానించినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అభిప్రాయడ్డారు. ఈ మేరకు గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ‘చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన కుల గణన హామీ అనేక మందిని ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలకు పాల్పడలేదు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం.ఈ విషయంపై పునరాలోచించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

‘పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు కూడా చాలా కాలంగా కుల ఆధారిత రాజకీయాలను అనుసరించారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ విధానం భారతీయ సమాజంలోని సంక్లిష్టతలపై ఆధారపడి ఉంది’ అని తెలిపారు. కులంపై కాంగ్రెస్ పార్టీ చారిత్రక వైఖరిని గుర్తు చేశారు. 1980లో ఇందిరా గాంధీ ఇచ్చిన ‘నా జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లాగేగీ హాత్ పర్’ అనే పిలుపునిచ్చారని, 1990లో రాజీవ్ గాంధీ కులతత్వాన్ని ఎన్నికల అంశంగా మార్చడాన్ని వ్యతిరేకించారని తెలిపారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ జాతీయ ప్రాముఖ్యత, సామాజిక సమస్యలపై విధానాల రూపకల్పనకు చర్చలను ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. నిరుద్యోగం, అసమానతలకు కులగణన పరిష్కరించలేదని స్పష్టం చేశారు. కాబట్టి ఈ అంశంపై పునరాలోచించాలని ఖర్గేను కోరారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed