డిజిటల్ స్ట్రైక్.. దేశంలో లక్షలాది వాట్సాప్ ఖాతాలు, సిమ్ కార్డ్‌లు బ్లాక్!

by Naga Rani Yarlagadda |

దేశంలో రోజురోజుకూ డిజిటల్ నేరాలు పెరిగిపోతుండటంతో కేంద్రం సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపింది. భారీగా వాట్సప్ అకౌంట్లు బ్లాక్ చేసింది.

డిజిటల్ స్ట్రైక్.. దేశంలో లక్షలాది వాట్సాప్ ఖాతాలు, సిమ్ కార్డ్‌లు బ్లాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భారీ క్రాక్‌డౌన్ ప్రారంభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేతృత్వంలో సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై పక్కా ప్రణాళికతో డిజిటల్ స్ట్రైక్ (Digital Strike) నిర్వహించారు. 2025 ప్రారంభం నుండి ఇప్పటివరకు మోసాలకు కేంద్ర బిందువుగా ఉన్న వేలాది ఖాతాలను అధికారులు నిర్వీర్యం చేశారు. 83,867 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేయగా.. 3,962 స్కైప్ ఐడీలను సైతం నిలిపివేశారు. అలాగే 827 హానికరమైన మొబైల్ యాప్స్ ను కూడా తొలగించారు.

మొబైల్ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం

టెలికాం శాఖ (DoT), పోలీసు బలగాల సమన్వయంతో నేరగాళ్ల మౌలిక సదుపాయాలను దెబ్బతీశారు. మొబైల్ నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపారు. సుమారు 8.45 లక్షల సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేశారు. నేరాలకు ఉపయోగించిన 2.39 లక్షల మొబైల్ ఐఎంఈఐ నంబర్లను నిలిపివేశారు. సహయోగ్ పోర్టల్ (Sahayog Portal) ద్వారా 1.11 లక్షలకు పైగా అనుమానాస్పద ఆన్‌లైన్ అంశాలను తొలగించారు.

ఎందుకీ చర్యలు?

ఇటీవల కాలంలో అమాయకులను ఫోన్ కాల్స్ ద్వారా భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేయడం, భారీ లాభాల ఆశచూపి పెట్టుబడి మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు పెరిగిపోయాయి. బాధితులు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కృంగిపోతున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ కీలక చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రియల్ టైమ్ మెకానిజం ద్వారా నేరగాళ్ల డివైజ్‌లను, క్రెడెన్షియల్స్‌ను స్తంభింపజేయడం ద్వారా పౌరులను రక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Next Story