కాలుష్య భారతం.. మోస్ట్ పొల్యూటెడ్ టాప్-50 సిటీల్లో ఏకంగా 42 ఇండియా నుంచే..

by Dishanational5 |
కాలుష్య భారతం.. మోస్ట్ పొల్యూటెడ్ టాప్-50 సిటీల్లో ఏకంగా 42 ఇండియా నుంచే..
X

దిశ, నేషనల్ బ్యూరో: కాలుష్య భూతం భారత్‌ను కమ్మేస్తోంది. దేశంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఫలితంగా దేశంలోనే ఏటా అనేకమంది కాలుష్య సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదిక దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. 2023లో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్‌కు సగటున 92.7 మైక్రో గ్రాములకు దిగజారింది. ఇది 2022లో క్యూబిక్ మీటరుకు 89.1 మైక్రోగ్రాములుగా ఉంది. ఇక, ప్రపంచంలోనే మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ అవతరించింది. మొదటి రెండు దేశాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో క్యూబిక్ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములు ఉండగా.. పాక్‌లో క్యూబిక్ మీటర్‌కు 73.7 మైక్రో గ్రాములుగా ఉంది. ఈ ర్యాంకింగ్‌లో భారత్ గతేడాది ఎనిమిదో స్థానంలో ఉంది.

అత్యంత కాలుష్య పట్టణంగా బెగూసరాయ్

ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా బిహార్‌లోని బెగుసరాయ్ నిలిచింది. బెగూసరాయ్‌లో గాలినాణ్యత క్యూబిక్ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. కాగా, 2022లో 131 దేశాల్లోని 7,323 ప్రాంతాల్లో సర్వే చేపట్టి డేటా సేకరించగా..2023లో 134 దేశాల్లోని 7,812 చోట్ల సర్వే నిర్వహించినట్టు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ సంస్థ తెలిపింది. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధనా సంస్థలు రూపొందించిన డేటాను సైతం పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. ఈ జాబితాలో టాప్-50 సిటీల్లో ఏకంగా 42 సిటీలు భారత్‌ నుంచే ఉండటం ఆందోళనకరం. టాప్-50 కాలుష్య పట్టణాల్లో 5వ స్థానంలో లాహోర్(పాక్), 12వ స్థానంలో ఫైసలాబాద్(పాక్), 13లో హటన్(చైనా), 24లో ఢాకా(బంగ్లాదేశ్), 34లో పెషావర్(పాక్), 42, 43, 44లో వరుసగా కాష్‌గర్(చైనా), సౌత్ టాంగెరంగ్(ఇండోనేషియా) పట్టణాలు మినహా మిగతా 42 సిటీలు భారత్‌ నుంచే ఉన్నాయి. టాప్-50 తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క పట్టణం కూడా లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు

మానవ ఆరోగ్యానికి రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం తీవ్ర ముప్పుగా పరిణమించింది. ప్రతి తొమ్మిది మరణాలలో ఒకరు వాయు కాలుష్యం కారణంగా మృతి చెందుతున్నట్టు పలు నివేదకలు తెలిపాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఏడు మిలియన్ల మంది కాలుష్యం భారిన పడుతున్నట్టు అంచనా వేస్తోంది. దీని కారణంగా ఆస్తమా, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తున్నట్టు పేర్కొంది.

ప్రపంచంలో టాప్-10 కాలుష్య దేశాలు

1. బంగ్లాదేశ్, 2.పాకిస్థాన్, 3. భారత్, 4, తజికిస్తాన్, 5. బుర్కినా ఫాసో, 6. ఇరాక్, 7. యూఏఈ, 8. నేపాల్, 9. ఈజిప్ట్, 10. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

టాప్-10 కాలుష్య పట్టణాలు

1.బెగుసరాయ్, 2. గువహతి, 3. ఢిల్లీ, 4. ముల్లన్‌పూర్, 5. లాహోర్(పాక్), 6. న్యూఢిల్లీ, 7. సివాన్, 8.సహర్సా, 9. గోషాయ్‌గావ్, 10. కతిహార్.



Next Story

Most Viewed