రిపబ్లిక్ డే వేడుకలకు హైటెక్ భద్రత.. పోలీసులకు 'ఏఐ' స్మార్ట్ గ్లాసెస్!

by Ramesh Naini |

2026 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించనున్నారు.

రిపబ్లిక్ డే వేడుకలకు హైటెక్ భద్రత.. పోలీసులకు ఏఐ స్మార్ట్ గ్లాసెస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఢిల్లీ పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా కృత్రిమ మేధ (AI)తో పనిచేసే ప్రత్యేకమైన 'స్మార్ట్ గ్లాసెస్' (Smart Glasses)ను పోలీసులు వినియోగించనున్నారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీ డీసీపీ దేవేశ్ మహ్లా వివరాలను వెల్లడించారు. భద్రతా పరంగా ఉపయుక్తంగా ఉండే అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను పూర్తిస్థాయిలో వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.

వేషం మార్చినా దొరికిపోతారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీసీటీవీ కెమెరాలన్నింటికీ వీడియో అనలిటిక్స్, 'ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్' (FRS)ను అనుసంధానించారు. నిందితులు లేదా వాంటెడ్ వ్యక్తులు మేకప్ వేసుకున్నా, ముఖానికి మాస్కు ధరించినా, టోపీ పెట్టుకున్నా, గడ్డం పెంచినా సరే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లోని అల్గారిథమ్ వారిని ఇట్టే గుర్తుపట్టేస్తుంది. నిందితుల ముఖంపై గాట్లు ఉన్నా, లేదా డేటాబేస్‌లో ఉన్నది 20 ఏళ్ల కిందటి ఫోటో అయినా సరే... ప్రస్తుత రూపంతో పోల్చి చూసి ఈ సిస్టమ్ వారిని గుర్తించగలదు.

ఇంటర్నెట్ లేకున్నా పనిచేసేలా..

ఈ వ్యవస్థ పూర్తిగా 'స్టాండలోన్' (Standalone) పద్ధతిలో పనిచేస్తుందని డీసీపీ తెలిపారు. ఇది ఇంటర్నెట్‌తో అనుసంధానించబడి ఉండదు. నిందితుల వివరాలతో కూడిన డేటాబేస్‌ను జిప్ ఫైల్ (Zip file) రూపంలో పోలీసుల మొబైల్ ఫోన్లలో లోడ్ చేస్తారు. ఈ ఫోన్లను స్మార్ట్ గ్లాసెస్‌కు కనెక్ట్ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా ఉంచుతారు. ఇప్పటికే ఈ కెమెరాలను, డేటాబేస్‌ను పరీక్షించామని, అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డీసీపీ పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 10 వేల మంది పోలీసులను మోహరించినట్లు డీసీపీ తెలిపారు. పాదచారులు మరియు వాహనాలకు మూడు అంచెల (3 Layer) భద్రతా తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు.

Next Story