ఢిల్లీ మద్యం కేసు : విచారణ ఏప్రిల్ 13కి వాయిదా

by Ramesh Naini |

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కేసు : విచారణ ఏప్రిల్ 13కి వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలని కోరుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు నిందితులు పిటిషన్లు దాఖలు చేయడం కోర్టులో వాడివేడి వాదనలకు దారితీసింది.

స్వయంగా వాదనలకు సిద్ధమైన కేజ్రీవాల్

జడ్జి తప్పుకోవాలని తాను వేసిన పిటిషన్‌ (రెక్యూజల్ అప్లికేషన్) పై వాదనలు వినిపించేందుకు కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ దశలో తన తరఫున ఇంకా ఏ లాయర్‌ను నియమించుకోలేదని, తన వాదనలు తానే వినిపిస్తానని కోర్టుకు తెలిపారు.

సీబీఐ తీవ్ర అభ్యంతరం

కేజ్రీవాల్ తీరుపై సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కోర్టు నాటకాలు ఆడే వేదిక కాదు’ అని ఆయన మండిపడ్డారు. వ్యవస్థలపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విచారణను సాగదీయాలనే ఉద్దేశంతోనే (మొత్తం 23 మంది నిందితుల్లో ఇప్పటికే 7 గురు) ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ కోర్టు ఈ పిటిషన్లను కొట్టివేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన వాదించారు.విచారణలో జాప్యం జరగకుండా చూడాలన్న సీబీఐ వాదనను అంగీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. జడ్జి తప్పుకోవాలని ఇంకెవరైనా నిందితులు పిటిషన్లు వేయదలుచుకుంటే ఇప్పుడే వేయాలని, ఒకరి తర్వాత ఒకరు విడివిడిగా వేస్తే వినబోనని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి తుది విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేశారు. కాగా, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 27న కేజ్రీవాల్‌తో సహా 23 మందిని విచారణనుంచి తప్పిస్తూ ఊరటనివ్వగా, దాన్ని సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, దర్యాప్తు అధికారి (IO) పై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ శర్మ గతంలో స్టే విధించారు. దీంతో, ఆమె విచారణ పట్ల నిష్పాక్షికతపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు ఈ కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతున్నారు.

Next Story