Delhi Metro: మెట్రోలో ప్రయాణించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. ప్రయాణికులతో ముచ్చట్లు!

by Ramesh Naini |

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం మెట్రోలో ప్రయాణించారు.

Delhi Metro: మెట్రోలో ప్రయాణించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. ప్రయాణికులతో ముచ్చట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ గేట్ నుంచి లాజ్‌పత్ నగర్ వరకు మెట్రోలో వెళ్లిన ఆమె, ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు సీఎంతో సెల్ఫీలు దిగారు. సీఎం సాధారణ ప్రయాణికుల్లా మెట్రోలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2002 డిసెంబర్ 24న అటల్ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీ మెట్రోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ, ఆయన జయంతి సందర్భంగా రేఖా గుప్తా మెట్రో ప్రయాణం చేయడం విశేషంగా భావిస్తున్నారు.

అనంతరం ఢిల్లీలో పేదలు, కూలీలు, అవసరమైన వర్గాల కోసం ‘అటల్ క్యాంటీన్లు’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కాగా, బీజేపీ ఎన్నికల హామీ నేపథ్యంలో రాజధానిలో రూ.5కే భోజనం అందించే 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్‌లో సుమారు రూ.100 కోట్లను కేటాయించారు. ప్రతి క్యాంటీన్‌లో ఉదయం 5:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు భోజనాలు అందించనున్నారు. భోజనంలో పప్పు, అన్నం, ఒక కర్రీ చపాతీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆహార నాణ్యతను ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పర్యవేక్షించనుంది. ఇక, శుభ్రమైన భోజనశాలు, తాగునీరు, టేబుళ్లు, కుర్చీలు, డిజిటల్ టోకెన్ విధానం, సీసీటీవీ నిఘా వంటి పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ క్యాంటీన్లు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటకే స్పష్టం చేసింది.

Next Story