CM కేసీఆర్‌తో కేజ్రీవాల్ కీలక భేటీ.. ఆ అంశంపై మద్దతు కోరనున్న ఢిల్లీ సీఎం!

by Disha Web Desk 19 |
CM కేసీఆర్‌తో కేజ్రీవాల్ కీలక భేటీ.. ఆ అంశంపై మద్దతు కోరనున్న ఢిల్లీ సీఎం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ కోసం కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ రానున్నారు. బ్యూరోక్రాట్ల నియంత్రణ అంశంపై కేంద్రంపై తమ పార్టీ చేస్తున్న పోరాటం విషయంలో పలు పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్న కేజ్రీవాల్.. వరుసగా ఆయా పార్టీల అధినేతలతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో కలిసి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వీలతో పాటు మరి కొంత మంది నేతలతో కేజ్రీవాల్ సమావేశమై బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ పేరు చెబితేనే చిటపటలాడే కేజ్రీవాల్ ఆ పార్టీ నేతలను సైతం కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉమ్మడి పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అయ్యేందుకు సమయం కావాలని కోరినట్లు స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

అయితే గత కొంత కాలంగా కేసీఆర్, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆమ్ ఆద్మీ నిర్ణయం తీసుకోగా ఈ విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌తో కేజ్రీవాల్ సమావేశం కాబోతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Also Read...

‘మాకు నీతులు చెప్పకు’’.. సీఎంకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్


Next Story