- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేటితో ఢిల్లీ ఎన్నికల ప్రచారం బంద్

- పోటీపోటీగా అన్ని పార్టీల ప్రచారం
- ఆప్ను టార్గెట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్
- బీజేపీపైనే ఆప్ నాయకుల ఆరోపణలు
- బీజేపీ, ఆప్ మధ్యే పోటీ
- ఈ సారి అధికార పీఠం మాదే అంటున్న బీజేపీ
- ఢిల్లీ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారంటున్న ఆప్
- డబుల్ డిజిట్ సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీ అసెంబ్లీ పోరు చివరి అంకానికి చేరుకుంది. దేశ ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం సోమవారం సాయంత్రానికి ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహిస్తుండటంతో ఈసీఐ నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారానికి తెరపడాల్సి ఉంది. దీంతో ఈ రోజు సాయంత్రం 6.00 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. మరోవైపు మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్.. ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్పై పోటికి దిగింది. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా.. ఎన్డీయే కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన రెండు సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సీపీఐ 6, సీపీఎం 2, సీపీఐ ఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ (కాన్షీరాం) 15, ఏఐఎంఐఎం రెండు చోట్ల బరిలోకి దిగాయి.
బీజేపీ, ఆప్ మధ్యే పోటీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కాస్త పెరిగింది. దీంతో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏడుగురు ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆప్కు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. ఇక ఆప్ మొదటి నుంచి ఉచిత పథకాలనే నమ్ముకుంది. ఉచిత విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం వంటివి తమను తిరిగి గెలిపిస్తాయని భావిస్తోంది. ఆప్ తరపున కేజ్రివాల్, మనీశ్ సిసోడియా, ఆతిషిలే విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు మరోసారి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇస్తారని ఆప్ అంచనా వేసుకుంటోంది.
ఉచితాలపై ఆప్ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ కూడా తమ మేనిఫెస్టోలో ఉచిత పథకాలను ప్రకటించింది. ఆప్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని.. కేజ్రివాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. యమునా నది ప్రక్షాళనను ఆప్ పూర్తిగా పక్కన పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. తమను గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని.. ఢిల్లీ మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ హామీ ఇస్తోంది. తాజాగా లోక్సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను విషయంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లతో పాటు పలువరు ఎన్డీయే నేతలు కూడా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?
2013లో కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత ఏ మాత్రం కోలుకోలేదు. శీలా దీక్షిత్ సర్కార్ హయాంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. హర్యానా ఎన్నికల నుంచి ఆప్తో వచ్చిన విభేదాల కారణంగా ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ సాధించేంత ఆదరణ ప్రజల్లో కనపడటం లేదని తెలుస్తోంది. అయితే తప్పకుండా భారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ టార్గెట్ను చేరుకోవడం కాంగ్రెస్కు కష్టమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ పూర్తిగా ఆప్నే టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆప్ కన్వీనర్ కేజ్రివాల్ లక్ష్యంగా పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం కారణంగా బీజేపీ లబ్దిపొందుతుందనే ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగిలిన పార్టీల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్న రెండు చోట్ల ముస్లింల ఓట్లను చీలిస్తే.. అది బీజేపీకే లాభం. బీఎస్పీ, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీల ప్రభావం ఢిల్లీలో అంతగా లేదని.. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రభావితం చేసే అంశాలు..
ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఢిల్లీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ట్యాప్లలో నల్లటి నీరు వస్తుండటంపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఉచిత నీరు అందిస్తున్నామని ఆప్ చెప్పుకుంటున్నా.. ఆ నీరు తాగడానికి పనకి రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు మురుగునీటి సమస్య కూడా ఢిల్లీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పలు నియోజకవర్గాల్లో డ్రైనేజీ సమస్య ఏళ్ల తరబడి అపరిష్క్రుతంగానే మిగిలిపోయింది. ఆప్ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చలేకపోవడంతోనే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడింది. మరోవైపు యమునా నది ప్రక్షాళన అంశం ఆప్, బీజేపీ మధ్య నలుగుతోంది. నది నీటి నాణ్యతపై ఆప్, బీజేపీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజధాని నగరంలో రోడ్లు కూడా సరిగా లేవు. ఏళ్ల తరబడి కొత్త రోడ్లు వేయకపోవడంతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.
రాజధానిలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోయింది. ఉద్యోగాలు ఇస్తామంటూ గతంలో ఆప్ ప్రామిస్ చేసిన దానిని నిలబెట్టుకోలేదు. ఇక గిగ్ జాబ్స్ చేసే వారు కూడా చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. సామాన్య ప్రజలు ఢిల్లీలో పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. వీటికి ఒక రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా కారణమే. కానీ ప్రజలు మాత్రం అధికార ఆప్నే దోషిగా చూస్తున్నారు. ఇది ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపనుంది. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగింది. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఒక ఐదు రోజుల్లో తెలిసిపోతుంది.
ఈసీఐపై కాంగ్రెస్ నిఘా
కాంగ్రెస్ పార్టీ నిష్ఫాక్షిక ఎన్నికల నిర్వహణకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ (ఈగల్) పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్యానల్ ముందుగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఆరోపణలపై దృష్టి పెట్టనుంది. మహారాష్ట్ర ఓటర్ లిస్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, రిపోర్టు సిద్ధం చేయనుంది. మహారాష్ట్రతో పాటు గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు.. త్వరలో జరగనున్న ఢిల్లీ, ఇతర రాష్ట్రాల ఎన్నికలపై అధ్యయనం చేయనుంది. ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ 'ఈగల్' పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్యానల్లో అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్. అభిషేక్ సింఘ్వీ, ప్రవీణ్ చక్రవర్తి, పవన్ ఖేరా, గుర్దీప్ సింగ్ సప్పాల్, నితిన్ రౌత్, చల్లా వంశీ చంద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.