రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో క్లియర్ విజిబులిటీ.. AQI 150గా నమోదు

by Naga Rani Yarlagadda |

రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల ప్రభావంతో ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత మెరుగుపడింది.

రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో క్లియర్ విజిబులిటీ.. AQI 150గా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల ప్రభావంతో ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత మెరుగుపడింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశ రాజధాని ముస్తాబవుతున్న వేళ గాలినాణ్యత మెరుగుపడటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 0.9 డిగ్రీలు తక్కువగా ఉండటం గమనార్హం.

ఆదివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 150గా నమోదైంది. ఇది మోస్తరు (Moderate) కేటగిరీలోకి వస్తుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించింది. మూడున్నర నెలల తర్వాత తొలిసారి నగర గాలి నాణ్యత మోస్తరు స్థాయికి దిగివచ్చినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం కురిసిన వర్షాల కారణంగా నగరంలో కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. శనివారం నుంచే గాలి నాణ్యతలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. CPCB మార్గదర్శకాల ప్రకారం .. AQI 0 నుంచి 50 మధ్య ఉంటే (Good), 51 నుంచి 100 వరకు Satisfactory, 101 నుంచి 200 వరకు Moderate, 201 నుంచి 300 వరకు Poor, 301 నుంచి 400 వరకు Very Poor, 401 నుంచి 500 వరకు Severeగా పరిగణిస్తారు.

మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు సీజనల్ సగటు కంటే తక్కువగానే కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వివిధ వాతావరణ కేంద్రాల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సఫ్దర్‌జంగ్‌లో 6.6 డిగ్రీలు, పాలమ్‌లో 4.5, లోధీ రోడ్‌లో 5.8, రిడ్జ్ ప్రాంతంలో 6.1, ఆయానగర్‌లో 5.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉదయం 8.30 గంటలకు నగరంలో తేమ శాతం 90 శాతంగా నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి వేళ మబ్బు కమ్మే అవకాశముందని, గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 19 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడే అవకాశం ఉందని తెలిపింది.

Next Story