భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-04 08:40:39  IST  )

భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎం శిబూ సోరెన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం సరిగ్గా 8.56 నిమిషాలకు శిబూ సోరెన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లుగా ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ అధికారికంగా ప్రకటించారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..

శిబూ సోరెన్ 1944, జనవరి 11న జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జన్మించారు. అయన రూపి కిస్కుని వివాహం చేసుకోగా ఆయనకు ముగ్గురు కుమారులు దుర్గా సోరెన్, హేమంత్ సోరెన్, బసంత్ సోరెన్, కుమార్తె అంజలి సోరెన్ ఉన్నారు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 1995 నుంచి 2005 వరకు జామా నుంచి ఎమ్మెల్యేగా పనిచేశాడు. దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ జామ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బసంత్ సోరెన్ జార్ఖండ్ యువమోర్చా అధ్యక్షుడిగా పని చేస్తూ దుమ్కా నుంచి 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అదేవిధంగా శిబూ సోరెన్ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 1980లో దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి 1989, 1991, 1996కు ఎంపీగా ఉన్నారు. అనంతరం జరిగిన లోససభ ఎన్నికల్లో 1999లో ఓడిపోయారు. ఇక 2002లో రాజ్యసభకు ఎన్నికై అదే ఏడాది జరిగిన దుమ్కా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి రాజ్యసభ స్థానానికి శిబూ సోరెన్ రాజీనామా చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ చిరుదిహ్ కేసులో ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో 2004 జూలై 24న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. శిబు సోరెన్ నెల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి తర్వాత సెప్టెంబరు 8న బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ వెంటనే శిబూ సోరెన్ కేంద్ర మంత్రివర్గంలో 2004 నవంబరు 27న బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఆయన జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజల్లో చైత్యన్యాన్ని నింపి పోరాటాలు కూడా చేశారు. 2005, 2009, 2010లో మూడు పర్యాయాలు ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

Next Story