బైక్‌లపై లక్షల లీటర్ల ఆయిల్ స్మగ్లింగ్.. ఇరాన్ నుంచి పాక్‌కు త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు

by Thanuru Gopichand |

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను, ఘ‌ర్ష‌ణ‌ల‌ వల్ల తలెత్తిన చమురు సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఆయిల్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా జ‌రుగుతున్న‌ది.

బైక్‌లపై లక్షల లీటర్ల ఆయిల్ స్మగ్లింగ్.. ఇరాన్ నుంచి పాక్‌కు త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను, ఘ‌ర్ష‌ణ‌ల‌ వల్ల తలెత్తిన చమురు సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఆయిల్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా జ‌రుగుతున్న‌ది. పాకిస్థాన్‌లో అధికారిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో, ఇరాన్ నుంచి చౌకగా లభించే ఇంధనానికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు సరిహద్దుల్లో సరికొత్త నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. నిరుద్యోగం, నిరంతర కరువుతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లోని అత్యంత వెనుకబడిన బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన దాదాపు 24 లక్షల మంది యువకులు, మాజీ రైతులు వేరే మార్గం లేక ప్రాణాలు పణంగా పెట్టి ఈ ప్రమాదకరమైన అక్రమ రవాణా బాట పట్టారు. ఈ స్మగ్లింగ్ ముఠాలు పాత మోటార్ సైకిళ్లపై వందలాది లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లను (దాదాపు 270 కేజీలకు పైగా బరువు) లోడ్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. 50 డిగ్రీల భానుడి భగభగలు, సరిహద్దుల్లో సాయుధ తిరుగుబాటుదారుల ముఠాల నిఘా నీడలోనే సుమారు 400 కిలోమీటర్ల మేర ఎడారి దారుల్లో ఈ స్మ‌గ్లింగ్ సాగుతున్న‌ది. కేవలం ఒక ట్రిప్పుకు వెయ్యి రూపాయల లాభం కోసం ఈ స్మగ్లింగ్ కొన‌సాగుత‌న్న‌ట్లు తెలుస్తున్న‌ది.

ఈ వ్యాపారం వల్ల ఏటా సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 8,300 కోట్లకు పైగా) విదేశీ ఇంధనం పాక్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తోందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అక్రమ ఆయిల్ దెబ్బకు పాకిస్థాన్ అధికారిక చమురు సంస్థల అమ్మకాలు గత 27 ఏళ్లలో లేనంత కనిష్టానికి పడిపోయాయి. దీనివల్ల పాక్ ప్రభుత్వ ఖజానాపై నెలకు 50 మిలియన్ డాలర్ల (రూ. 400 కోట్లకు పైగా) అదనపు భారం పడుతున్న‌ది. ఈ ఆయిల్ మాఫియా వెనుక ఇరాన్ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుండటంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు అధికారులు సరిహద్దుల్లో క్రాక్‌డౌన్ ప్రారంభించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున రక్షణ కంచె నిర్మాణ పనులను ముమ్మరం చేశారు.

Next Story