Dallewal: దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి విషమం.. 27వ రోజుకు చేరిన ఆమరణ దీక్ష

by B.Srinivas |

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు దల్లేవాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

Dallewal: దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి విషమం.. 27వ రోజుకు చేరిన ఆమరణ దీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంఎస్పీకి చట్టబద్దమైన హామీ సహా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తు్న్న రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ (Jagjit Singh Dallewal) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఖనౌరీ సరిహద్దు (Khanauri border) వద్ద దీక్ష చేస్తున్న దల్లేవాల్‌కు పలువురు వైద్యులు ఆదివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు గుండెపోటుతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అటువంటి వారికి ఐసీయూలో చికిత్స అవసరమని తెలిపారు. 27 రోజులుగా నిరంతర నిరాహారదీక్ష కారణంగా అతనిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని, ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని పేర్కొన్నారు. కాగా, పంటలపై కనీస మద్దతు ధర (MSP)కి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 70 ఏళ్ల దల్లేవాల్ నవంబర్ 26న తన నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మరోవైపు దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి డిసెంబర్ 26కు నెల రోజులు అవుతున్న సందర్భంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) తెలిపింది.

Next Story