- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cyber Crime: ఆ నలుగురి ప్రేమలో తాత..! ఏకంగా రూ.8.7 కోట్లు కాజేసిన సైబర్ నేరాగాళ్లు
సోషల్ మీడియా వేదికగా నలుగురు మహిళల పేరుతో ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.8.7 కోట్లు కాజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియా వేదికగా నలుగురు మహిళల పేరుతో (Mumbai) ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎరవేసిన (Cybercriminals) సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.8.7 కోట్లు కాజేశారు. మోసపోయాయని గ్రహించిన తాత.. చివరికి ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధుడికి 2023లో షార్వీ (Sharvi) అనే మహిళ నుంచి ఫేస్బుక్లో రిక్వెస్ట్ వచ్చింది. ఓకే చేయగా ఆ తర్వాత ప్రేమను నటిస్తూ చాటింగ్ చేయడంతో ఫిదా అయిన తాత ఏకంగా తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో రోజూ ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్ చాటింగ్ షురూ అయింది. ఆ మహిళ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నట్లు బాధితుడిని నమ్మించి పిల్లల ఆరోగ్యం బాగోలేదంటూ మాయమాటలు చెప్పి వృద్దుడి నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తర్వాత కవిత అనే మరో మహిళ సైతం ఇలాగే స్నేహం చేసి డబ్బులు లాగేసింది. ఆ తర్వాత షార్వీ సోదరిని అంటూ దినాజ్ అనే మరో మహిళ మెసేజ్లు పంపింది. షార్వీ చనిపోయిందంటూ ఫేక్ ఆస్పత్రి బిల్లులు చూపించి డబ్బులు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అడగగా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. మరికొన్ని రోజులకు దినాజ్ ఫ్రెండ్గా పరిచయమైన జాస్మిన్కు సైతం వృద్ధుడు నగదు చెల్లించాడు.
734 సార్లు నగదు బదిలీ..
ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు, ఆ వృద్ధుడు 734 సార్లు నగదు పంపించి.. రూ. 8.7 కోట్లు స్వాహా చేశారు. వృద్ధుడి బ్యాంకు ఖాతా ఖాళీ అవడంతో తన కోడలి నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకొని పంపడం షురూ చేశాడు. తన కొడుకును నుంచి సైతం రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఇలా తరుచూ అడుగుతుండటంతో కొడుకుకి అనుమానం వచ్చి ఆరా తీయగా తన తండ్రి సైబర్ మోసానికి గురైనట్లు తేలింది. దీంతో కొడుకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసపోయానని గ్రహించిన తాత.. ఆ దెబ్బకు చివరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వృద్ధుడిని మోసం చేసిన ఆ నలుగురు మహిళలు ఒకే వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.






