ఈద్ పండుగలో గోవధ భాగం కాదు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పశువధ నియంత్రణ ఉత్తర్వులను కలకత్తా హైకోర్టు సమర్ధించింది.

ఈద్ పండుగలో గోవధ భాగం కాదు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో నూతనంగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం పశుగ్రాస నియంత్రణ, వధపై విధించిన ఆంక్షలకు కలకత్తా హైకోర్టు (Calcutta High Court) చట్టబద్ధమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే బక్రీద్ (Bakrid) పండుగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం మే 13న జారీ చేసిన వివాదాస్పద నోటిఫికేషన్‌ను ఉన్నత న్యాయస్థానం సమర్ధించింది. అంతేకాకుండా, ఇస్లాం మతాచారాల ప్రకారం ఈద్ పండుగలో గోవధ అనేది ఒక ముఖ్యమైన భాగం కాదనే విషయాన్ని స్పష్టం చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టును ఆశ్రయించిన టీఎంసీ..

పశ్చిమ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్, 1950 కింద సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ టీఎంసీ ఎమ్మెల్యే అక్రుజ్జమాన్ (Akruzzaman) కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖల చేశారు. ఈ పిటిషనర్ తరఫున టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) కోర్టులో వాదనలు వినిపించారు. ఈ ఆంక్షల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పశువుల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతారని ఆమె వాదించారు. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ పార్థసారథి సేన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ వారి పిటిషన్లను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘మొహమ్మద్ హనీఫ్ ఖురేషి వర్సెస్ బీహార్ ప్రభుత్వం’ కేసు తీర్పును గుర్తు చేస్తూ.. బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేయడం అనేది ఇస్లాంలో ఖచ్చితమైన మతపరమైన నిబంధన ఏమీ కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో పశువుల వధను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా తెలిపింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం 14 ఏళ్లు పైబడిన, శాశ్వతంగా అంగవైకల్యం, తీవ్ర వ్యాధులకు గురైన పశువులను మాత్రమే, అది కూడా మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ జారీ చేసే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంటేనే వధించడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించనున్నారు.

Next Story