వారసుడి కోసం 10 కాన్పులు.. ఆడ - మగ సమానత్వం ఇదేనా?

by Naga Rani Yarlagadda |

జనవరి తొలివారంలో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా భునాలో సంజయ్ - సునీత దంపతులు 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా హర్యానాలోనే మరో ప్రాంతంలో ఓ జంట 9 మంది ఆడపిల్లల తర్వాత 10వ కాన్పులో మగబిడ్డను కన్నారు.

వారసుడి కోసం 10 కాన్పులు.. ఆడ - మగ సమానత్వం ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడ- మగ సమానం.. ఏ బిడ్డ పుట్టినా వారసుల్లాగే చూడాలి.. ఇవన్నీ మాటల వరకే పరిమితమా? తీరా మన వంతు వచ్చే సరికి ఆ బేధాన్ని చూపిస్తున్నామా అంటే.. అవుననే చెప్తున్నాయి ఈ ఘటనలు. జనవరి తొలివారంలో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా భునాలో సంజయ్ - సునీత దంపతులు 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా హర్యానాలోనే మరో ప్రాంతంలో ఓ జంట 9 మంది ఆడపిల్లల తర్వాత 10వ కాన్పులో మగబిడ్డను కన్నారు. వారసుడు పుట్టాలని ఇంతమందిని కనడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. పోనీ వారికి ఆ ఆడపిల్లలందరినీ చదివించి, కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేసి పంపే స్తోమత ఉందా అంటే.. కనీసం కడుపునిండా తిండిపెట్టి పెంచి పెద్దచేసే స్తోమత కూడా ఉన్నట్లు కనిపించడం లేదు.

రాష్ట్రంలోని జింద్ జిల్లా ఉచనా కలాన్లో సురేంద్ర - రీతూ దంపతులు ఆదివారం సాయంత్రం 10వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చారు. సురేంద్ర సోదరుడికి కూడా ముగ్గురు కూతుర్లు ఉండగా.. మొత్తం 12 మంది ఆడపిల్లల్లోనూ తొలిసారి తమ్ముడు పుట్టాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వారికి వివాహమై 24 ఏళ్లు అయిందని సమీప బంధువు వెల్లడించారు. ఆ బాబుకు దిల్ ఖుష్ అని నామకరణం చేస్తామని తెలిపారు. కాగా.. ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా.. మగ సంతానం కోసం, వారసుడు కావాలంటూ గుడ్డిగా పిల్లల్ని కంటుండటంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సంజయ్ - సునీత దంపతులైతే తమకు అంతమంది పిల్లల్ని పోషించే స్తోమత లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరినట్లు అప్పట్లో మీడియా తెలిపింది. మగబిడ్డ కోసం అంతమందిని కనడం ఎందుకు? ఆడపిల్లలైతే ఎందులో తక్కువ? ఒకరిద్దరిని కని వారినే చక్కగా చదివిస్తే.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడతారు కదా అని కొందరు వాపోతున్నారు. ఎవరెన్ని చెప్పినా.. వారసులుగా కొడుకులే కావాలనుకునే ఇలాంటి మూర్ఖులు మారరంటున్నారు.

Next Story