కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాలిబాన్‌ సంస్కృతి ఖాయమని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్‏సింహ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరులో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన...కర్ణాటక ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్‌ ఎస్‌డీపీఐ, పీఎఫ్ఐ, కేఎఫ్‏డీ వంటి ఉగ్రవాద సంస్థలతో లోపాయికారి ఒప్పందాలను కుదర్చుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని సూచించారు.

2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు, సంఘ విద్రోహక శక్తులతో కాంగ్రెస్‌ అంటకాగుతోందని ఎంపీ ప్రతాప్‌సింహ విరుచుకుపడ్డారు. దీంతో, ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. బీజేపీదే తాలిబాన్ మనస్తత్వమని కౌంటర్ అటాక్‌కు దిగింది. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విద్వేషపూరిత అజెండాను తెరపైకి తెచ్చారని, ప్రజలు ఎవరికి బుద్దిచెబుతారో తెలుసుకునేందుకు మరో నెల రోజులు ఆగాలని బీజేపీ నేతలకు కాంగ్రెస్‌ సూచించింది.


Next Story

Most Viewed