లోక్‌సభలో వీగిన రాజ్యాంగ సవరణ బిల్లు.. విపక్షాలపై మంత్రి కిరణ్ రిజిజు ఫైర్!

by Ramesh Naini |

బిల్లు వీగిన అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

లోక్‌సభలో వీగిన రాజ్యాంగ సవరణ బిల్లు.. విపక్షాలపై మంత్రి కిరణ్ రిజిజు ఫైర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిల్లు వీగిన అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ బిల్లును ఆమోదించడానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజార్టీని అధికార ఎన్డీఏ కూటమి సాధించలేకపోయింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం.. సభలో ఉన్న సభ్యుల సంఖ్య దృష్ట్యా బిల్లు ఆమోదం పొందాలంటే 352 ఓట్లు అవసరం. కానీ, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఏకంగా 230 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది.

అవకాశాన్ని చేజార్చుకున్నారు: కిరణ్ రిజిజు

బిల్లు వీగిపోయిన అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని మహిళలకు గౌరవం, సమాన హక్కులు కల్పించే ఈ చారిత్రక, అత్యంత ముఖ్యమైన బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం చాలా విచారకరం. ఈ చారిత్రక ఘట్టంలో మహిళలకు అండగా నిలిచే సువర్ణ అవకాశాన్ని విపక్షాలు చేజార్చుకున్నాయి. అయితే, ప్రధాని మోడీ నాయకత్వంలో మహిళలకు వారి హక్కులు, గౌరవం దక్కే వరకు మా ఈ లక్ష్య సాధన ఆగదు. వారికి హక్కులు కల్పించి తీరుతాం’ అని స్పష్టం చేశారు.

మిగతా రెండు బిల్లుల ఉపసంహరణ..

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో.. దానికి అంతర్గతంగా ముడిపడి ఉన్న మరో రెండు బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026 లను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలియజేశారు. ప్రధాన సవరణ బిల్లు వీగిపోయినందున, ఈ రెండు బిల్లులను దాని నుంచి విడిగా చూడలేమని స్పష్టం చేశారు.

Next Story