నితీశ్ తప్పుకోవడానికి కాంగ్రెసే కారణం: జేడీయూ

by Dishanational2 |
నితీశ్ తప్పుకోవడానికి కాంగ్రెసే కారణం: జేడీయూ
X

దిశ, నేషనల్ బ్యూరో: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడంపై ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో జేడీయూ స్పందించింది. ఇండియా కూటమి నుంచి నితీశ్ తప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించింది. కూటమి నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ కుట్ర చేసిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. ‘డిసెంబర్ 19న జరిగిన భారత కూటమి సమావేశంలో మమతా బెనర్జీతో కుమ్మక్కై మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీనిపై జేడీయూకు సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపారు. అంతేగాక సీట్ల పంపకాల ప్రక్రియను కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించిందని, మిత్రపక్షాలపై అసమానమైన డిమాండ్‌లు చేసి వారిని అవమానించిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు ఇండియా కూటమి ఐక్యత, సమగ్రతకు హానికరంగా ఉన్నాయని ఆరోపించారు. సీట్ల పంపకం తక్షణమే జరగాలని జేడీయూ వాదిస్తున్నా..దానికి తగ్గ ప్రణాళికలు రచించలేదని చెప్పారు.

కూటమిని విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర: డీఎంకే

డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ మీడియాతో మాట్లాడుతూ నితీశ్ పై బీజేపీ ఒత్తిడి చేసిందన్నారు. ‘బీజేపీ నుంచి నితీశ్ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇండియా కూటమిని కాషాయ పార్టీ విచ్ఛిన్నం చేయాలనుకుంటోంది. అందుకే నితీశ్ ను తమవైపు తిప్పుకుంది. లాలూకి వ్యతిరేకంగా నితీశ్‌ను ఉపయోగించుకుంటుంది’ అని తెలిపారు. మరోవైపు ఇండియా కూటమి సీట్ షేరింగ్‌పై డీఎంకే, కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.



Next Story

Most Viewed