బెంగాల్‌లో బీజేపీకి కాంగ్రెస్, సీపీఎం సాయం చేస్తున్నాయి: మమతా బెనర్జీ విమర్శలు

by Dishanational1 |
బెంగాల్‌లో బీజేపీకి కాంగ్రెస్, సీపీఎం సాయం చేస్తున్నాయి: మమతా బెనర్జీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రెండు కళ్లు లాంటివని దీదీ ఎద్దేవా చేశారు. ఆదివారం మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తోందని గుర్తుచేశారు. కేంద్ర నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. బెంగాల్‌లో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదు. కానీ, ఇక్కడ కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు బీజేపీతో చేతులు కలిపాయి. కాబట్టి ప్రజలు ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటు వేసినట్టే. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకునేందుకు, మోడీకి సహాయం చేయడమే కాంగ్రెస్, సీపీఐ(ఎం)ల లక్ష్యమని మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్, సీపీఐ నేతలు బీజేపీ గొంతుగా మారారని, రాష్ట్రంలో ప్రజాపాలనను అందిస్తున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని దీదీ ఘాటుగా విమర్శించారు. ఇక, దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాల ఇండియా కూటమి బలంగా ఉందని, కూటమికి పేరు పెట్టింది కూడా తానేనని దీదీ అన్నారు. అయితే, బెంగాల్‌లో ఇండియా కూటమి ఉనికి లేదు. రాష్ట్ర స్థాయి నాయకులు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.



Next Story

Most Viewed