కాంగ్రెస్ బ్యాంకు ఖతాలు సీజ్: ఐటీ శాఖపై అజయ్ మాకెన్ ఆగ్రహం

by Dishanational2 |
కాంగ్రెస్ బ్యాంకు ఖతాలు సీజ్: ఐటీ శాఖపై అజయ్ మాకెన్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌కు చెందిన నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ సీజ్ చేసిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్దమైందని మాకెన్ అభివర్ణించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ సహా..ఇతర ఖాతాల్లోని రూ.210 కోట్లను ఆదాయ పన్నుశాఖ స్తంభింsపజేసిందని, కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘పార్టీ జారీ చేసిన చెక్కులను బ్యాంకులు నిలిపివేసినట్లు మాకు సమాచారం అందింది. బ్యాంకులు మా చెక్కులను క్లియర్ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను కూడా సీజ్ చేశారు. అలాగే క్రౌడ్ ఫండింగ్ అకౌంట్స్‌ను కూడా స్తంభింపజేశారు’ అని తెలిపారు. ఖాతాలు నిలిపి వేయడం వల్ల భారత్ జోడో న్యాయ్ యాత్రలో సహా, ఇతర రాజకీయ కార్యకలాపాలన్ని దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లు చెల్లించడానికి, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ వద్ద డబ్బు లేదని వెల్లడించారు. కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖాతాలను సీజ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.

ప్రజాస్వామ్యంపై దాడి: మల్లికార్జున్ ఖర్గే

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖాతాల సీజ్‌కు సంబంధించిన అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖాతాలను స్తంభింపజేయడం భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, మోడీ ప్రభుత్వం అధికార మత్తులో ఉందని విమర్శించారు. ‘బీజేపీ వసూలు చేసిన రాజ్యాంగ విరుద్ధమైన డబ్బును ఎన్నికలకు వినియోగిస్తారు. అయితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ సేకరించిన డబ్బును మాత్రం సీజ్ చేశారు’ అని ఆరోపించారు.‘ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నందు వల్లే భవిష్యత్తులో ఎన్నికలు ఉండబోవని చెప్పాం. దేశంలోని న్యాయవ్యవస్థను, బహుళ-పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed