Congress: ఈ టికెట్ పై ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన ప్రకటనలు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) చేపట్టింది. అయితే, ఆ తర్వాత ఈ విషయం రాజకీయంగా మారింది.

Congress: ఈ టికెట్ పై ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన ప్రకటనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) చేపట్టింది. అయితే, ఆ తర్వాత ఈ విషయం రాజకీయంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం రైల్వే ఈ-టికెట్లపై ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ (Congress) మండిపడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ మీడియా అడ్వైజర్‌ పీయూష్ బాబెల్‌ ఎక్స్‌ వేదికగా ఒక ఫొటోను పంచుకున్నారు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్‌ అది. అందులో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఫొటోతో ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించిన ప్రకటన ఉంది. ‘మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆపరేషన్‌ సిందూర్‌ను రైల్వే టికెట్లపై ప్రకటనగా వేశారు. సైన్య పరాక్రమాన్ని ఓ ప్రాడక్ట్ గా మార్చేశారు. ఇది దేశభక్తి కాదు..బిహార్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని వాడుకోవడం. ఇలాంటి ప్రచారాలను ఆపేయాలి’ అని బాబెల్‌ పోస్టుకి రాసుకొచ్చారు. మరోవైపు, ఇదే విషయంపై బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP) ఎంపీ కున్వర్‌ డానిష్‌ అలీ సైతం స్పందించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను మోడీ అవకాశంగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

రైల్వే బోర్డ ఏమందంటే?

అయితే, కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై బీజేపీ నేతలు స్పందించలేదు. కానీ, కాంగ్రెస్ విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్‌ కుమార్ స్పందించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ను సాయుధ దళాలు విజయవంతంగా నిర్వహించినందుకు గర్విస్తున్నాం. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసింది. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్‌ చేసి.. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది. ఈ ఆపరేషన్‌ గురించి దేశప్రజలందరూ తెలుసుకోవాలని భావిస్తున్నాం. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు’ అని కుమార్‌ పేర్కొన్నారు.

Next Story