కాంగ్రెస్ 11వ జాబితా రిలీజ్: ఆ రెండు సీట్లపై ఇంకా వీడని ఉత్కంఠ

by Dishanational2 |
కాంగ్రెస్ 11వ జాబితా రిలీజ్: ఆ రెండు సీట్లపై ఇంకా వీడని ఉత్కంఠ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు గాను 11వ జాబితాలు మంగళవారం రిలీజ్ చేసింది. ఈ లిస్టులో 4రాష్ట్రాల నుంచి 17మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనిలో ఒడిశా నుంచి 8 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి ఐదుగురు, బిహార్‌లో ముగ్గురు, బెంగాల్‌ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు. సోమవారం విడుదల చేసిన పదో జాబితాలో కేవలం ఇద్దరి పేర్లను మాత్రమే వెల్లడించింది. మహారాష్ట్రలోని అకోలా, తెలంగాణలోని వరంగల్ నుంచి మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 228కి చేరింది.

బిహార్‌లో తొలి జాబితా

బిహార్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం ఇదే తొలిసారి. సీట్ షేరింగ్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు వచ్చాయి. గతంలో ఆ రాష్ట్రంలో ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. తాజా జాబితాలో ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో కిషన్ గంజ్, కతిహార్, భాగల్ పూర్‌లలో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇద్దరు ముస్లిం నేతలకు టిక్కెట్లు దక్కాయి. కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, కతిహార్ నుంచి ప్రముఖ నేత తారిఖ్ అన్వర్ బరిలోకి దిగనున్నారు. భాగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ పోటీ చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్ నుంచి డాక్టర్ మునీష్ తమాంగ్‌ను పోటీలోకి దింపింది. ఆంద్రప్రదేశ్‌లో కడప పార్లమెంటు స్థానం నుంచి రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను ప్రకటించింది.

అమేథీ, రాయ్ బరేలీపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్ బరేలీ లోక్‌సభ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్లలో గతంలో అమేథీ నుంచి రాహుల్, రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీలు బరిలోకి దిగగా..రాహుల్ ఓడిపోగా సోనియా గాంధీ గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. ఇక అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed