సర్కార్ సంచలన నిర్ణయం.. K-Rail ప్రాజెక్టును రద్దు చేసిన సీఎం

by Naga Rani Yarlagadda |

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన.. K-Rail ప్రాజెక్టును సీఎం సతీశన్ రద్దు చేశారు.

సర్కార్ సంచలన నిర్ణయం.. K-Rail ప్రాజెక్టును రద్దు చేసిన సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వీడీ సతీశన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న వివాదాస్పద తిరువనంతపురం - కాసరగోడ్ సిల్వర్ లైన్ రైల్వే కారిడార్ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం.. మీడియా సమావేశంలో సీఎం సతీశన్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. K-Rail ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల సరిహద్దుల్ని గుర్తించేందుకు నాటిని సర్వే రాళ్లన్నింటినీ వెంటనే తొలగించాలని రెవెన్యూ శాఖ అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టుకోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో నమోదైన కేసుల్ని కూడా వెంటనే విత్ డ్రా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసుల తీవ్రతను పరిశీలించిన తర్వాతే ఆయా కేసుల్ని విత్ డ్రా చేసుకునేందుకు కోర్టుల్లో అఫిడవిట్లు వేయనున్నట్లు సీఎం సతీశన్ వివరించారు. గతంలో ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ పార్టీనే ముందున్న విషయం తెలిసిందే. పినరయి విజయన్ నేతృత్వంలోని LDF సర్కార్ 2019లో 530 కిలోమీటర్ల పొడవైన సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్ ను ప్రతిపాదించింది. రాష్ట్రానికి దక్షిణాన ఉన్న తిరువనంతపురాన్ని, ఉత్తర సరిహద్దు జిల్లా అయిన కాసరగోడ్ తో అనుసంధానించేలా దీనిని రూపకల్పన చేశారు. భూ సేకరణ, నిర్వాసితుల సమస్యల కారణంగా ప్రాజెక్టుపై మొదటి నుంచి ప్రజల నుంచి నిరసనలు, రాజకీయ వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు వల్ల 10 వేల కుటుంబాలు నిర్వాసితులు కావలసి రావడంతోనే ఉద్యమం మరింత ఉద్రిక్తమయింది.

Next Story