సీఎం పదవి మార్పు వివాదానికి తెర..! రేపు డీకే ఇంటికి వెళ్లనున్న సిద్ధరామయ్య

by Kema Shiva Kumar |

కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు వివాదానికి తెర పడే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

సీఎం పదవి మార్పు వివాదానికి తెర..! రేపు డీకే ఇంటికి వెళ్లనున్న సిద్ధరామయ్య
X

దిశ, వెబ్‌‌డెస్క్: కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు వివాదానికి తెర పడే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు రేపు సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) నివాసానికి వెళ్లనున్నారు. తమ మధ్య సంబంధాలు సరిగ్గానే ఉన్నాయని సంకేతాలు ఇచ్చేందుకు అధిష్ఠానం ఆదేశాల మేరకు రేపు వారిద్దరూ మరోసారి భేటీ కాబోతున్నారు. శనివారం డీకే శివకుమార్ సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నాయకత్వ విషయంలో అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల శాసనసభ సమావేశాలకు ముందు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగానే కొనసాగిస్తూ.. ఇద్దరి మధ్య నాయకత్వ పోరును సమసిపోయేలా చేసేందుకు అధిష్టానం ఈ చర్యలు చేపట్టినట్లుగా కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మేరకు సీఎం శనివారం చెప్పినట్టుగానే రేపు డిప్యూటీ సీఎం శివకుమార్ ఇంటికి భోజనానికి వెళ్తారని అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి.

కాగా, నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలంలో రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న ప్రచారం ఊపందకుంది. 2023లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరిగినట్లుగా చెబుతున్న అధికార భాగస్వామ్య ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Next Story