40 మంది తిరుగుబాటుదారులు ఎన్ కౌంటర్.. మణిపూర్‌లో టెన్షన్.. టెన్షన్..!

by Disha Web Desk 19 |
40 మంది తిరుగుబాటుదారులు ఎన్ కౌంటర్.. మణిపూర్‌లో టెన్షన్.. టెన్షన్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్‌లో తలెత్తిన భారీ హింసాకాండపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన తిరుగుబాటుదారులు అత్యాధునిక ఎం-16, ఏకే -47అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ గన్ లను పౌరులపై ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రజాహింసకు పాల్పడుతున్న తిరుగుబాటు దారులను వదిలే ప్రసక్తే లేదని ఇప్పటి వరకు 40 మంది తిరుగుబాటు దారులను ఎన్ కౌంటర్ చేసినట్లు స్పష్టం చేశారు. నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుతున్నారని మణిపూర్‌ను విచ్ఛిన్నం చేయడానికి సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ పోరాటంలో కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధిస్తుందన్నారు.

కాగా మణిపూర్‌లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్ద ఎత్తున హింసాకాండకు దారి తీసింది. షెడ్యూల్డ్ ట్రైబల్లోకి తమను చేర్చాలనే మేతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘీభావ యాత్ర హింసాకాండకు దారి తీసింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న అల్లర్లలో ఇప్పటి వరకు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది.

ఇదిలా ఉంటే ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు తెలిసింది. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించబోతున్నారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాష్ట్రానికి వెళ్లారు.


Next Story

Most Viewed