CJI Khanna: అత్యవసర కేసుల్లో మౌఖిక ప్రస్తావన సరికాదు.. సీజేఐ సంజీవ్ ఖన్నా

by B.Srinivas |

అత్యవసరంగా జాబితా చేసే కేసుల్లో మౌఖిక ప్రస్తావన అనుమతించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.

CJI Khanna: అత్యవసర కేసుల్లో మౌఖిక ప్రస్తావన సరికాదు.. సీజేఐ సంజీవ్ ఖన్నా
X

దిశ, నేషనల్ బ్యూరో: అత్యవసరంగా జాబితా చేసే కేసుల్లో మౌఖిక ప్రస్తావన అనుమతించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా(Sanjeev Khanna) స్పష్టం చేశారు. ఇటువంటి సమయాల్లో న్యాయవాదులు ఈ మెయిల్ లేదా ముందస్తు లేఖలు పంపించాలని కోరారు. ఎమర్జెన్సీ విచారణకు గల కారణాన్ని సైతం వివరించాలని సూచించారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ కేసునైనా వెంటనే జాబితా చేస్తే మౌఖికంగా విచారించలేరని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మూడో స్తంభమైన న్యాయవ్యవస్థకు నాయకత్వం వహించడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. పౌరులకు న్యాయం సులభంగా పొందేలా చూడటమే న్యాయవ్యవస్థ యొక్క ప్రధాన రాజ్యాంగ విధి అని తెలిపారు. ఇప్పటి వరకు న్యాయవాదులు అత్యవసర విచారణ కోసం సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందు మౌఖిక అప్పీల్ చేసేవారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి నిలిచిపోనుంది. తక్షణ జాబితా, కేసు విచారణ ఎందుకు అవసరమో వివరిస్తూ న్యాయవాదులు ఈ మెయిల్‌లు, లేఖలు పంపాల్సి ఉంటుంది. కాగా, దేశ 51వ సీజేఐగా సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Next Story