Delhi Elections: ఆప్, బీజేపీ మధ్య చైనీస్ కెమెరాల లొల్లి

by Shamantha N |

త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.

Delhi Elections: ఆప్, బీజేపీ మధ్య చైనీస్ కెమెరాల లొల్లి
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) జరగనున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీ స్థానం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. అయితే, అదే స్థానం నుంచి బరిలోకి దిగినవ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ(Parvesh Verma ).. కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటున్నారని, మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా భద్రతాకోణంలో చూసినా ముప్పు వాటిల్లుతుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేల నిధిగా ఉన్న రూ.30 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. న్యూఢిల్లీలో ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదని, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.

పంజాబ్ మాఫియాతో..

ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయడానికి బదులు.. పంజాబ్ మాఫియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని కేజ్రీవాల్ కలలు కంటున్నారని ప్రవేశ్‌వర్మ ఆరోపించారు. అలాగే పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని, వారు ఆప్ కార్యకర్తలుగా మారి, ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అమృత్‌సర్‌ నుండి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని, వాటిలోని వస్తువులను తనిఖీ చేయడం లేదని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్‌ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి ఖాయమని ప్రవేశ్‌వర్మ జోస్యం చెప్పారు

Next Story