China : ఆ కథనాలన్నీ అవాస్తవం.. పాక్‌కు ఆయుధాల సరఫరాపై చైనా

by B.Srinivas |

భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్ కు సైనిక విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేశారని వెలువడుతున్న కథనాలను చైనా తోసిపుచ్చింది.

China : ఆ కథనాలన్నీ అవాస్తవం.. పాక్‌కు ఆయుధాల సరఫరాపై చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (India pakisthan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్‌కు తమ సైనిక విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేశారని వెలువడుతున్న కథనాలను చైనా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్‌ వేదికగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్) సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పీఎల్ఏఏఎఫ్‌కు చెందిన వై-20 రవాణా విమానం ద్వారా పాక్‌కు ఎటువంటి ఆయుధ సామగ్రిని డెలివరీ చేయలేదని స్పష్టం చేసింది. పాక్‌కు సహాయ సామాగ్రిని తీసుకెళ్లడానికి Y-20ని ఉపయోగించారని వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని తెలిపింది. నకిలీ కథనాలు ప్రచారం చేసే వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

కాగా, ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) టైంలో చైనా తమ వై-20 సైనిక విమానం ద్వారా పాక్‌కు ఆయుధాలు సప్లై చేసిందని ఇటీవల పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే చైనా క్లారిటీ ఇచ్చింది. అయితే 2020, 2024 మధ్య పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు చైనా అని, ఆ దేశ ఆయుధ దిగుమతుల్లో 81 శాతం చైనానే సరఫరా చేస్తుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదికలో వెల్లడైంది. వాటిలో ఫైటర్ జెట్‌లు, రాడార్లు, జలాంతర్గాములు, క్షిపణి వ్యవస్థలు వంటి అధునాతన సైనిక పరికరాలు ఉన్నాయని పేర్కొంది.

Next Story