ఎన్సీపీ లీడర్ హత్య.. తొలి ముఖ్యమంత్రి కుమారుడికి జీవితఖైదు

by Naga Rani Yarlagadda |

2003లో జరిగిన రామ్ జగ్గీ మర్డర్ కేసులో ఛత్తీస్ ఘడ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ఎన్సీపీ లీడర్ హత్య.. తొలి ముఖ్యమంత్రి కుమారుడికి జీవితఖైదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, జేసీసీ (జే) నేత అమిత్ జోగికి 2003లో జరిగిన ఎన్సీపీ ట్రెజరర్ రామ్ అవతార్ జగ్గీ హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రిల్ 2న ఈ తీర్పును వెలువరించింది. "అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధం, ఆధారాలకు విరుద్ధంగా ఉంది. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాలను పరిశీలిస్తే, ఈ కుట్రలో అమిత్ జోగి కీలక పాత్ర పోషించారని స్పష్టమవుతోంది" అని ధర్మాసనం పేర్కొంది. జూన్ 4, 2003న ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కోశాధికారి రామ్ అవతార్ జగ్గీ కాల్చివేతకు గురయ్యారు. ఒక రాజకీయ ర్యాలీపై చర్చించి తిరిగి వస్తుండగా ఆయనను దుండగులు చంపేశారు.

తొలుత ఇది దోపిడీ దొంగతనంగా భావించినప్పటికీ, 2004లో కేసును స్వీకరించిన సీబీఐ అసలు కుట్రను బయటపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగికి జగ్గీ రాజకీయంగా ముప్పుగా మారడమే ఈ హత్యకు కారణమని సీబీఐ అభియోగం మోపింది. జూన్ 10, 2003న రాయ్‌పూర్‌లో భారీ ఎన్సీపీ ర్యాలీ నిర్వహించేందుకు జగ్గీ సిద్ధమయ్యారు. దీనిని అడ్డుకునేందుకే అమిత్ జోగి, ఇతరులు కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసులో గతంలో ట్రయల్ కోర్టు 28 మందికి శిక్ష విధించినప్పటికీ, అమిత్ జోగిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించిన హైకోర్టు, ఇప్పుడు అమిత్ జోగిని దోషిగా తేల్చింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమిత్ జోగి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 20న విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అప్పటి వరకు అమిత్ జోగికి ఊరట లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Next Story