బాంబు బెదిరింపు మెయిల్స్ వెనుక లవ్ ఫెయిల్యూర్.. ప్రియుడిపై ప్రతీకారంలో భాగంగా దిమ్మతిరిగే ప్లాన్

by Naga Rani Yarlagadda |

అహ్మదాబాద్‌లోని ప్రముఖ సంస్థలకు వరుసగా వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్ల కేసులో చెన్నైకి చెందిన మహిళా టెక్నీషియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బాంబు బెదిరింపు మెయిల్స్ వెనుక లవ్ ఫెయిల్యూర్.. ప్రియుడిపై ప్రతీకారంలో భాగంగా దిమ్మతిరిగే ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని ప్రముఖ సంస్థలకు వరుసగా వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్ల కేసులో చెన్నైకి చెందిన మహిళా టెక్నీషియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెనీ జోషిల్డా అనే రోబోటిక్స్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ డెలాయిట్ యూఎస్ఐలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. ఆమె గతంలో జరిగిన ఓ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే బాధ్యురాలినంటూ చేసిన ఈమెయిల్ ప్రకటనలతో కేసు కొత్త మలుపు తిరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల అహ్మదాబాద్‌లో వివిధ స్కూల్స్, ఆసుపత్రులు, స్టేడియం తదితర చోట్లకు 21 బెదిరింపు ఈమెయిళ్లు అందాయి. మొదటిగా సర్ఖేజ్‌లోని జెనీవా లిబరల్ స్కూల్‌కు వచ్చిన ఈమెయిల్ ఆధారంగా కేసు వెలుగులోకి వచ్చింది. తదుపరి విచారణలో నరేంద్ర మోదీ స్టేడియానికి 13, భోపాల్‌లోని స్కూల్‌కు మూడు, బీజే మెడికల్ కాలేజీకి ఒక ఈమెయిల్ పంపినట్లు రెనీపై ఆరోపణలు ఉన్నాయి.

ఈమెయిళ్లలోని సమాచారం ప్రకారం, రెనీ 270 మంది మరణించిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే కారణమని పేర్కొంది. ఈ వివరాలను క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ శరద్ సింఘాల్ వెల్లడించారు. ప్రేమలో విఫలమైన అనంతరం, ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ బెదిరింపు ఈమెయిళ్లకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అతని పేరు ఉపయోగించి ఫేక్ అకౌంట్లు, వర్చువల్ నంబర్లతో పాటు, డార్క్ వెబ్, వీపీఎన్, ప్రోటాన్ మెయిల్, పాకిస్తాన్ నుంచి పంపినట్లు చూపించే స్పూఫ్‌డ్ మెయిల్‌ ఐడీలతో రెనీ తన అచూకీ దాచేందుకు ప్రయత్నించింది. అయినా పోలీసులు చెన్నైలో ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు.

2021 నుండి ఆమె పలుచోట్ల ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ సహా 11 రాష్ట్రాల్లో ఆమె యాక్టివిటీని గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం రెనీ ఒంటరిగానే ఈ నేరాలకు పాల్పడిందా లేక మరెవైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story