కేంద్రం ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు

by Dishanational1 |
కేంద్రం ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలోని ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నకిలీ సమాచారాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. కానీ, దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అంశం భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించినదని పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ కంటెంట్‌లో తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కి సవరణలు కూడా చేసింది. కానీ, తాజా నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు ఐటీ నిబంధనలపై సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బాంబె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ సందర్భంగా న్యాయస్థానం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై ఎదురైన ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు కేంద్రం జారీ చేసిన నొటిఫికేషన్‌పై స్టే విధిస్తున్నామని కోర్టు పేర్కొంది.


Next Story