జాతీయ సెలవు దినంగా అంబేద్కర్ జయంతి

by Ajay Maddhiboyina |

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయబడతాయని కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయ సెలవు దినంగా అంబేద్కర్ జయంతి
X

- నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

- ఉత్తర్వులు జారీ

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, ఇతర సంస్థలకు సెలవును వర్తింపజేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. సమాజంలో సమానత్వం కోసం కృషి చేసి, ఒక కొత్త శకాన్ని ప్రారంభించిన మహనీయుడైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని ఆయన తెలిపారు. బాబాసాహెబ్‌కు అనుచరుడిగా చెప్పుకునే ప్రధాన నరేంద్ర మోడీ.. ఈ నిర్ణయం తీసుకొని దేశ ప్రజల మనోభావాలను గౌరవించారని మంత్రి చెప్పారు.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయబడతాయని కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవియన్స్, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న సంస్థలు, శాఖలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. కాగా, బాబా సాహెబ్‌గా పిలువబడే డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. ఆధునిక భారత్‌ను రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర. దళితులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఆయనను ప్రముఖ వ్యక్తిగా గుర్తిస్తారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం బలంగా పోరాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన చిరస్మరణీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆర్థిక వేత్తగా, విద్యా వేత్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపారు. ఇండియా మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ పని చేశారు.

Next Story