చక్కెర ఎగుమతులపై కేంద్రం ఉక్కుపాదం.. మరోసారి నిషేధం పొడిగింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 02:39:14  IST  )

భారతదేశంలో చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చక్కెర ఎగుమతులపై కేంద్రం ఉక్కుపాదం.. మరోసారి నిషేధం పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్‌లో చక్కెర (Sugar) ధరలు పెరగకుండా అదుపు చేసేందుకు, నిల్వలను పెంచేందుకు గాను భారత ప్రభుత్వం (Govt. of India) కీలక నిర్ణయం తీసుకున్నది. చక్కెర ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 2026 వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో చక్కెర ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్, గత కొంతకాలంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల చెరకు దిగుబడి తగ్గుదలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. దేశీయ వినియోగానికి సరిపడా నిల్వలను పక్కన పెట్టడంతో పాటు, సామాన్యులపై ధరల భారం పడకుండా ఉండాలని కేంద్రం ఈ ఆంక్షలను పొడిగించింది.

ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం..

భారత్ నుండి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ చక్కెర వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, చక్కెర ధరలు అదుపు తప్పకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది.

Next Story