తెలంగాణ ప్రజలకు కేంద్రం వినాయక చవితి కానుక

by Disha Web Desk 2 |
తెలంగాణ ప్రజలకు కేంద్రం వినాయక చవితి కానుక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక చవితి కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది. ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి బెంగళూరు వరకు 610 కిలోమీటర్ల దూరం. గతంలో బెంగళూరుకు వెళ్లేందుకు 11:20 గంటల సమయం పట్టేది. కానీ, ఇక వందేభారత్‌తో 8:30 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు దాదాపు మూడు గంటల సమయం ఆదా కానుంది. కాచిగూడ(హైదరాబాద్)-యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.


కాచిగూడ నుంచి ఉదయం 5:30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్‌కు 6:59కి చేరుకుంటుంది. కర్నూల్ సిటీకి 8:39 గంటలకు, అనంతపూర్‌కు 10:54 గంటలకు చేరుకుంటుంది. చివరగా యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నం 2:15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి, అనంతపూర్‌లో సాయంత్రం 5:40కి, కర్నూల్ సిటీ సాయంత్రం 7:50కి, మహబూబ్‌నగర్ రాత్రి 9.39 స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30కి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు

= ఇది 12 జిల్లాల గుండా వెళ్తుంది(తెలంగాణ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ : కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కర్ణాటక : చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్)

=‌‌ సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లు

= గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు. వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు.

= ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ(హైదరాబాద్), కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్(బెంగళూరు)

= దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానిని ఈ రైలు అనుసంధానం చేస్తుంది.



Next Story

Most Viewed