India-US trade deal: ఇండియా-యూఎస్ డీల్ పై లోక్‍సభలో కేంద్రం ప్రకటన

by Prasad Jukanti |

భారత్ -అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి రాజీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.

India-US trade deal: ఇండియా-యూఎస్ డీల్ పై లోక్‍సభలో కేంద్రం ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‍పై (India US Trade Deal) కేంద్రం పార్లమెంట్‍లో కీలక ప్రకటన చేసింది. ఇవాళ లోక్ సభలో (Lok Sabha) మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో భారత్ సేఫే అని స్పష్టం చేశారు. మన రైతులకు ఈ డీల్ రక్షణ ఇస్తుందన్నారు. మోడీ-ట్రంప్ రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతులకు లాభం చేకూరనుందని ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు.

స్పీకర్ సీరియస్:

అయితే భారత్ -యూఎస్ ట్రేడ్ డీల్ పై పీయూష్ గోయల్ ప్రసంగం సమయంలో లోక్ సభలో గందరగోళం ఏర్పడింది. ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే గోయల్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే విధానం ఇదేనా సీనియర్లు, గతంలో ప్రభుత్వాన్ని నడిపిన వారు వ్యవహిరించే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను ఈరోజు మధ్యహానం 2 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.

మొన్న ఒప్పందం ఇవాళ సభలో ప్రకటన:

కాగా భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అగీకరిస్తున్నామని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మా వస్తువులపై సున్నా సుంకాలకు, రష్యా చమురు నిలిపివేతకు భారత్ అంగీకరించిందని మోడీ నాకు గొప్ప స్నేహితుడు అని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ డీల్ తో 25 శాతం అదనపు సుంకాలు భారత్ పై ఉండబోవని యూఎస్ స్పష్టం చేసింది. ఇకపై సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని తెలిపింది. ట్రంప్ ప్రకటను భారత ప్రభుత్వం సైతం ధృవీకరించగా ఇవాళ పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించింది.
Next Story