కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోంది: కాంగ్రెస్ విమర్శలు

by Dishanational2 |
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోంది: కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందిని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్ సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. అందుకే ఆదాయ పన్ను శాఖ ద్వారా కాంగ్రెస్ ఖాతాల నుంచి రూ.65కోట్లు లూటీ చేసిందని విమర్శించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌లతో కలిసి కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి దేశాన్ని నియంతృత్వంలోని దింపేందుకు కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుండదీయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర, రైతుల ఉద్యమం, పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని అందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతోందన్నారు. ఐదు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా అయినట్టు తెలిపారు. ఈ చర్య ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతును మూసేసే కుట్ర జరుగుతోందని, ఇటువంటి పరిస్థితులు దేశంలో ఎన్నడూ లేవని తెలిపారు. దేశాన్ని రాజరికంలోకి నెట్టివేసే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 14న ఏఐసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు చెందిన బ్యాంక్ అకౌంట్లకు ఐటీశాఖ స్తంభింపజేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed