- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE: 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నేడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది.

దిశ, వెబ్డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నేడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 93.70% మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే (93.66%) ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా మెరుగుపడింది. వెబ్సైట్లతో పాటు విద్యార్థులకు వేగంగా ఫలితాలు అందించేందుకు బోర్డు పలు డిజిటల్ ప్లాట్ఫారమ్లను అందుబాటులోకి తెచ్చింది. results.cbse.nic.in, cbse.gov.in అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ APAAR ID లేదా పాఠశాల అందించిన పిన్ (Pin) ద్వారా లాగిన్ అయి డిజిటల్ మార్క్షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లలో ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫలితాలను నేరుగా పొందవచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ (IVRS) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలలో మరోసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.99% కాగా, అబ్బాయిలు 92.6% సాధించారు. ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం, విజయవాడ రీజియన్లు 99.79% ఉత్తీర్ణతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. చెన్నై 99.58% తో తర్వాతి స్థానంలో ఉంది.
మెరిట్ లిస్ట్ లేదు...
విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్ఈ ఈసారి కూడా టాపర్ల జాబితా లేదా మెరిట్ లిస్ట్ను ప్రకటించలేదు. అయితే, సబ్జెక్టులలో టాప్ 0.1% మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా 'మెరిట్ సర్టిఫికెట్లు' జారీ చేస్తామని బోర్డు తెలిపింది. మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే వారి కోసం మే 15, 2026 నుంచి రెండో విడత బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగగా, ఫలితాలను రికార్డు సమయంలో ఏప్రిల్ 15నే విడుదల చేయడం విశేషం.






