తేజస్వీయాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు.. రెండోసారి కూడా విచారణకు గైర్హాజరు

by Disha Web Desk 12 |
తేజస్వీయాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు.. రెండోసారి కూడా విచారణకు గైర్హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన కుటుంబ సభ్యులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో తేజస్వీయాదవ్‌ను మార్చి 4వ తేదీన విచారణకు పిలిచింది. కానీ, ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో, శనివారం (మార్చి 11) విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. మరోవైపు, తేజస్వి యాదవ్ తన భార్యతో కలిసి ఆసుపత్రిలో ఉన్నందున ఈ రోజు కూడా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి తెలియజేశారు.

‘భార్య ఆరోగ్యం దృష్ట్యా తేజస్వి యాదవ్ సీబీఐ ఎదుట హాజరు కావడం లేదు. ఈడీ దాడి తర్వాత ఆమె నిన్న ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భవతి, పన్నెండు గంటల విచారణ తర్వాత బీపీ సమస్య కారణంగా స్పృహతప్పి పడిపోయింది’ అని వర్గాలు తెలిపాయి. తేజస్వీ తల్లిదండ్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను విచారించిన సీబీఐ అధికారులు, రోజుల వ్యవధిలోనే తేజస్వికి సమన్లను పంపడం గమనార్హం. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ జరిగినట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా...ఢిల్లీ, ముంబయి, పాట్నాలో ఇంతకు మునుపే అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం బీహార్ డిప్యుటీ సీఎం తేజస్వీయాదవ్‌ ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు



Next Story

Most Viewed