దత్తతపై వెళ్లిన పిల్లలకు నిజమైన పేరెంట్స్ వివరాలివ్వలేం.. కోర్టు కీలక తీర్పు

by Hajipasha |
దత్తతపై వెళ్లిన పిల్లలకు నిజమైన పేరెంట్స్ వివరాలివ్వలేం.. కోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : పిల్లల దత్తత వ్యవహారాలపై కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇతరులు దత్తత తీసుకున్న పిల్లలు పెరిగి పెద్ద వాళ్లయ్యాక.. తమ నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని భావించడం తప్పేం కాదని కోర్టు పేర్కొంది. అయితే వారికి ఆ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు అందించడమనేది.. నిజమైన తల్లిదండ్రుల గోప్యతా హక్కుకు భంగం కలిగించినట్లు అవుతుందని న్యాయమూర్తి జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే.. 1988లో ఒక బెంగాలీ అవివాహిత మహిళ తన పిల్లవాడిని స్విట్జర్లాండ్‌కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తన నిజమైన తల్లిదండ్రులను వెతుక్కుంటూ స్విట్జర్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లో దత్తత వ్యవహారాలను చూసే ప్రభుత్వ శాఖలను సంప్రదించాడు. కానీ అధికారులెవరూ ఆ యువకుడి నిజమైన పేరెంట్స్ సమాచారాన్ని ఇచ్చేందుకు నో చెప్పారు.

కోర్టు కీలక వ్యాఖ్యలివీ..

దీంతో ఆ యువకుడు కోల్‌కతా హైకోర్టు‌లో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన న్యాయస్థానం.. ‘‘నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు పిటిషనర్‌కు ఉంది. కానీ ఈ సమాచారాన్ని అతడికి అందించడమనే చర్య వల్ల నిజమైన తల్లిదండ్రుల గోప్యతా హక్కుకు భంగం కలుగుతుంది. అందుకే ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’’ అని న్యాయమూర్తి జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య తీర్పు ఇచ్చారు. ‘‘ప్రత్యేకించి ఈ పిటిషన్‌లో పిల్లవాడిని దత్తత ఇచ్చే సమయానికి అతడి తల్లి ఒక అవివాహిత. సమాజ పరిస్థితుల కారణంగా ఆమె పేరును ఇప్పుడు బయటపెట్టడం అస్సలు కుదరదు’’ అని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed